మన రాష్ట్రంలో బెండ సుమారుగా 29,౩15 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. మొత్తం 4,౩9,725 టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. ఈ పంటకు వేడి  వాతావరణం అనుకూలం. అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకు ప్రతికూలం. అందువల్ల ఈ పంట వర్షాకాలంతో పాటు వేసవి కాలంలో పండించటానికి అనుకూలమైనది.

 

నేలలు
సారవంతమైన, నీరు ఇంకే తేలికపాటి నేలలు, మురుగు నీరు పోయే సౌకర్యం గల తేలికపాటి నల్లరేగడి నేలలు అనుకూలం.

 

విత్తే సమయం
వర్షాకాలపు పంటను జూన్ నుండి జూలై వరకు, వేసవి పంటను జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి  చివరి వరకు విత్తుకోవచ్చు.

విత్తన మోతాదు
ఎకరాకు వర్షాకాలపు పంటకు 4 -6 కిలోలు, వేసవి పంటకు 7 -8 కిలోలు, సంకరజాతి రకాలకు 2 -2 .5 కిలోల విత్తనం కావాలి.

రకాలు

పర్భని క్రాంతి, అర్క అనామిక,  అర్క అభయ వంటి రకాలు 85-9౦ రోజుల పంటకాలాన్ని కలిగి వుంటాయి.
సంకర జాతి కోవకు చెందిన వర్ష, విజయ, విశాల్, నాథ్ శోభ, మహికో హైబ్రిడ్ నెం. 6, 7, 8, 1౦, ప్రియ, సుప్రియ, ఐశ్వర్య, మిస్టిక్, ఎస్ 71౦9 , తులసి రకాలను మరియు ఎగుమతికి అనువైన పంజాబ్ పద్మని, వర్ష, విశాల్, నాథ్ శోభ రకాలను కూడా సాగు చేసుకోవచ్చు. ప్రధానమైన పంట రకాలి, వాటి గుణ గణాల వివరాలు దిగువన ఉన్నాయి.

 

పంట రకం

గుణ గణాలు

దిగుబడి (ఎకరానికి / టన్నులు) 

పర్భని క్రాంతి

కొమ్మలు వేయకుండా బలంగా పెరిగే మొక్క, ఆకులు ముదురాకు పచ్చ రంగులో వుంటాయి.

4 - 4.5

అర్క అనామిక

విత్తిన 5 5 రోజుల్లో కాపుకొస్తుంది. శంకు రోగాన్ని కొంతవరకు తట్టుకోగలడు. కాయలు ముదురాకు పచ్చగా వుండి మధ్యస్తంగా వుంటాయి.

4 - 5

అర్క అభయ

అర్క అనామిక రకాన్నిపోలి వుండి, శంఖు రోగాన్ని బాగా తట్టుకుంటుంది.

4 – 5

 

విత్తడం / నాటడం  

కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిక్లోప్రిడ్ తో  తరువాత 4 గ్రాముల  ట్రైకోడెర్మవిరిడితో కలిపి విత్తన శుద్ధి చేయాలి.

నేలను 4-5 సార్లు బాగా దున్నాలి. వర్షాకాలపు పంటను 6౦ సెంటి మీటర్ల ఎడంతో బోదెలమీద ౩౦ సెంటి మీటర్ల దూరంలో విత్తు కోవాలి. వేసవి కాలపు పంటను, నేలను మళ్ళుగా చేసి వరుసల మధ్య 45 సెంటి మీటర్ల మొక్కల మధ్య 15-2౦ సెంటి మీటర్ల దూరంలో ఉండేటట్లు విత్తు కోవాలి . విత్తిన వెంటనే నీరు పెట్టి తరువాత 4 - 5 రోజులకు రెండవ తడి నీరు ఇవ్వాలి. పాదుకు ఒక మొక్క వుంచి మిగిలినవి తీసివేయాలి.
 

ఎరువుల యాజమాన్యం  
చివరి దుక్కిలో ఎకరాకు 6 – 8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలిపి దున్నాలి. 24 కిలోల భాస్వరం, పొటాష్ నిచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కిలో వేయాలి. 48 కిలోల నిచ్చే నత్రజని ఎరువును ౩ సమ భాగాలుగా చేసి 1/౩ వంతు ఆఖరి దుక్కిలో, మిగిలిన 2/౩ వంతును 2 భాగాలుగా విత్తిన ౩౦వ మరియు 45 వ రోజున వేయాలి. సంకరజాతి రకాలను ఎరువుల మోతాదు సుమారు 5౦ శాతం పెంచి వేయాలి.

 

పంట మార్పిడి 
బెండ – ఆలుగడ్డ – టమోటా – బెండ – పాలకూర – పుచ్చ కాయ, బెండ – ముల్లంగి-కాలిప్లవార్- కీర దోస, బెండ – టమాటో- తోటకూర, బెండ-ఆలుగడ్డ – సజ్జ క్రమంలో పంట మార్పిడిని పాటించాలి.

 

కలుపు నివారణ, అంతర కృషి
పెండి మిథాలిన్ ౩౦ శాతం ఎకరాకు 1.2లీ. చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి.  విత్తిన 25, ౩౦ రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చేయాలి. వర్షా కాలంలో మట్టిని ఎగదోసే బోదెలు సరి చేయాలి.
పంట పూత దశలో లీటరు నీటికి 10 గ్రా. యూరియా కలిపి పిచికారి చేయడం ద్వారా 20-25 శాతం నత్రజని ఆధాతోపాటు అధిక దిగుబడి పొందవచ్చు. అలాగే లీటరు నీటికి 5 మి.గ్రా. సూక్ష్మ పోషక పదార్దల మిశ్రమాన్ని కలిపి పిచికారి చేయడం ద్వారా కూడా అధిక దిగుబడిని పొందవచ్చు.

 

నీటి యాజమాన్యం
వర్షా కాలపు పంటకు సకాలంలో వర్షాలు రాకపోతే 7 - 8 రోజులకొకసారి నీరు పట్టాలి. వేసవి పంటకు ప్రతి            4 - 5 రోజులకొకసారి నీరు పెట్టాలి.

 

పంట కోత
విత్తిన 45 - 5౦ రోజులకు మొదటి కోత కొస్తుంది . తప్పనిసరిగా ప్రతి 2 - ౩ రోజులకొకసారి కోత కోయాలి. ఎకరాకు వర్షాకాలపు పంటకు ౩-4 టన్నులు, వేసవి పంటకు 2-2.5 టన్నుల దిగుబడి వస్తుంది.